ఆంధ్ర ప్రదేశ్

తిరుమల లడ్డూ ప్రసాదంపై సంచలన వ్యాఖ్యలు: ‘అసలు నెయ్యే లేదు’ – ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

Published by
Srinivas

పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, భక్తుల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. “శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఉప ముఖ్యమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, గతంలో తాను తిరుమల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో అనేక మంది భక్తులు, బాధ్యతగల వ్యక్తులు ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. “ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది, దాన్ని సరిదిద్దాలి” అని తాను పలుమార్లు చెప్పినా అప్పట్లో పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా నెయ్యి ధరల విషయంలోనే తనకు అనుమానం వచ్చిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. “కిలో నువ్వుల నూనె ధర కూడా ఎక్కువగా ఉండే పరిస్థితిలో, అతి తక్కువ రేటుకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా లభిస్తుంది? ఇక్కడ ఖచ్చితంగా ఎక్కడో తప్పు జరుగుతోంది” అని తాను గ్రహించానన్నారు.

ఈ నేపథ్యంలో, గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో, అలాగే అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానాలు పాలకులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా తాను దీక్ష చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇక అత్యంత కీలకంగా, ఈ వ్యవహారంపై జరిగిన SIT విచారణ ఫలితాలను ప్రస్తావిస్తూ, “లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని, అది పూర్తిగా ఒక రకమైన కెమికల్ నెయ్యిగా తేలింది” అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ నివేదిక తన అనుమానాలకు బలం చేకూర్చిందని ఆయన అన్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.