రాయలసీమ నేలపై గురువారం జరిగిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” బహిరంగ సభ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రజల తాకిడి, ఉత్సాహం, ఘనతతో ఈ సభ రాయలసీమ రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన ముద్ర వేసింది.
ఈ సభకు ప్రధాన అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధానిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వేదికపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్, మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వేదికను ఆశీర్వదించిన మోదీ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దేశ ప్రగతిలో కీలకమైన భాగంగా పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ… “ఆత్మనిర్భర్ భారత్కు సరికొత్త శక్తిగా ఆంధ్రప్రదేశ్ తయారవుతోంది. చంద్రబాబు గారి సారథ్యంలో ఏపీ ప్రగతి ద్వారాలు తెరుచుకుని వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. దేశ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా కీలకం. ఏపీ అభివృద్ధి చెందాలంటే రాయలసీమ అభివృద్ధి అంతే ముఖ్యమైంది. కర్నూలులో ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త అవకాశాలను తెరుస్తాయి,” అని అన్నారు.
అలాగే పారిశ్రామిక రంగం, ఉపాధి గురించి ప్రధాని మాట్లాడుతూ… “కొప్పర్తి – ఓర్వకల్ పారిశ్రామిక నోడ్ల ద్వారా వచ్చే పెట్టుబడులు వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. సహజ వాయువు పైప్లైన్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. దీని ద్వారా 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా చేయబడుతుంది. ” అని ప్రధాని వివరించారు.
ఇంకా… మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో “జీఎస్టీ పొదువు ఉత్సవం”ను పండుగలా నిర్వహించిన విధానం పట్ల కూడా ప్రధాని ప్రశంసలు కురిపించారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రజలలో అవగాహన కల్పించడం, సేవింగ్స్ ప్రాధాన్యాన్ని వివరించడం అభినందనీయం అని అన్నారు.
మోదీ ప్రసంగం మొత్తం కర్నూలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. సభా ప్రాంగణం “మోదీ… మోదీ…” నినాదాలతో మార్మోగింది. చంద్రబాబు–పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రధానమంత్రి చేసిన ఈ ప్రసంగం రాయలసీమ అభివృద్ధికి నూతన శక్తి, ఆశాభావాన్ని కలిగించింది.
ప్రధాని పర్యటన సందర్భంగా కర్నూలు నగరం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.