ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు పేద మరియు మధ్యతరగతి వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని ప్రకటించారు. ఈ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల లాభం చేకూరుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “జీఎస్టీ సంస్కరణలతో మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తూ, భారతీయ బ్రాండ్లు గ్లోబల్ మార్కెట్లో పోటీ పడే పరిస్థితులు ఏర్పడతాయి. దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారు. ఈ సంస్కరణలు ప్రతి ఇంటికీ లాభం కలిగిస్తాయి,” అని అన్నారు.
జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రత్యేక ప్రచారాన్ని చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దసరా నుంచి దీపావళి వరకు “జీఎస్టీ ఉత్సవాలు” పేరుతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగు వారాల్లో మొత్తం 65 వేల సమావేశాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని వివరించారు.
అక్టోబర్ 19 వరకు 26 జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రచారం కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “జీఎస్టీ బెనిఫిట్స్ను ప్రజలకు చేరువ చేసి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే మా లక్ష్యం” అని ఆయన తెలిపారు.