ఆంధ్ర ప్రదేశ్

నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర: వైస్‌ ఛాన్స్‌లర్ల సమావేశంలో మంత్రి నారా లోకేష్

Published by
Rahul N

విజయవాడలో నిర్వహించిన పబ్లిక్ యూనివర్సిటీల వైస్‌ ఛాన్స్‌లర్ల సమావేశంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ నిర్మాణంలో విశ్వవిద్యాలయాల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

పబ్లిక్ యూనివర్సిటీల వైస్‌ ఛాన్స్‌లర్లతో జరిగిన సమీక్షలో, ఉన్నత విద్య రంగంలో సంస్కరణలకు వారు అంబాసిడర్లుగా పనిచేయాలని మంత్రి కోరారు. నాణ్యమైన విద్య, పరిశోధన, ఇన్నోవేషన్‌లపై దృష్టి పెట్టి యూనివర్సిటీలను దేశంలోనే అగ్రస్థానాల్లో నిలిపేలా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ప్రభుత్వం తరఫున మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కొత్త దిశగా ముందుకు సాగాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

మంత్రి నారా లోకేష్ తన ప్రసంగంలో మాట్లాడుతూ, “నేను మంత్రి అయ్యాక గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలిసినప్పుడు, ఆయన చాలా స్పష్టంగా ఒక్కటే లక్ష్యాన్ని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలను దేశంలోనే టాప్ స్థాయికి తీసుకెళ్లాలి అని టార్గెట్ ఇచ్చారు” అని గుర్తు చేశారు.

తన సుదీర్ఘ పాదయాత్ర అనుభవాలను ప్రస్తావించిన మంత్రి, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ యువతను ప్రత్యక్షంగా కలసి వారి ఆశలు, ఆకాంక్షలను తెలుసుకున్నానని చెప్పారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సవాళ్లతో కూడిన విద్యా శాఖ బాధ్యతలను స్వీకరించానని పేర్కొన్నారు.

రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత యూనివర్సిటీలదేనని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ సమావేశం రాష్ట్ర ఉన్నత విద్య రంగంలో సంస్కరణలకు ఒక కీలక అడుగుగా నిలిచిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Rahul N