ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధి కి తైవాన్ సహకారం కోరారు విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ఉండవల్లి నివాసంలో తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్ తో నారా లోకేష్ చర్చలు జరిపారు.
ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల్లో తైవాన్ అగ్రగామిగా ఉంది. ఈ రంగాల అభివృద్ధికి తైవాన్ తీసుకొచ్చిన పాలసీలు, తీసుకున్న చర్యల గురించి నారా లోకేష్, తైవాన్ ప్రతినిధుల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న సహకారం గురించి వాళ్లకు వివరించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పద్దతిలో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న సహకారం గురించి పలు ఉదాహరణలతో తైవాన్ బృందానికి వివరించారు లోకేష్. 2014- 19 వరకూ తిరుపతి లో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి కల్పించిన మౌలిక సదుపాయాలు, అక్కడ ఏర్పాటైన అనేక కంపెనీలు తద్వారా వేలాదిగా యువతకు లభించిన ఉద్యోగ అవకాశాల గురించి తైవాన్ బృందానికి వివరించారు.
లోకేష్ వివరణ, ప్రజెంటేషన్ పై తైవాన్ అధికారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. తైవాన్ లో అనేక కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలతో ఉన్నాయి. ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు సహకారం అందించాలని లోకేష్ బృందాన్ని కోరారు. ఆయా కంపెనీలు సులభంగా కార్యకలాపాలు ప్రారంభించే విధంగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.