రుషికొండ ప్యాలెస్.. తీగ లాగుతున్నారు

Published by
Srinivas

జగన్ హయాంలో ఎందుకు కడుతున్నారో కూడా చెప్పకుండా కట్టిన రుషికొండ ప్యాలెస్ పై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపుల వ్యవహరంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు.

రుషికొండ ప్యాలెస్ కట్టిన కాంట్రాక్టరుకు ఎందుకు బిల్లులు చెల్లింపులు చేశారో చెప్పాలంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను వివరణ కోరారు పయ్యావుల. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, రుషికొండ ప్యాలెస్ కట్టిన కాంట్రాక్టర్ కు ఇంకా కొన్ని బిల్లులు చెల్లించలేదంట. అదే కాంట్రాక్టర్ చేసిన వేరే పనులకు పూర్తి బిల్లులు చెల్లించినట్టు అధికారులు చెప్పడంతో, పయ్యావుల ఆశ్చర్యపోయారు.

గతంలో ఓసారి చెప్పినప్పటికీ ఎలా బిల్లులు చెల్లిస్తారంటూ పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ కాంట్రాక్టరుకు జరిపిన చెల్లింపుల వివరాలు.. ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా..? లేక సొంత నిర్ణయమా..? అంటూ అధికారులను వివరణ కోరారు మంత్రి. సీఎం లేదా తన దృష్టికి తీసుకురాకుండా బిల్లుల చెల్లింపులు జరిపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి. 

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.