ఏపీ కేబినెట్ మీట్ లో కీలక నిర్ణయాలు

Published by
Srinivas

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు.

రాబోయే 3 నెలల్లో జనంలోకి వెళ్లేలా పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి. ప్రజలకు, నేతలకు కనెక్టివిటీ తగ్గిపోతోందని.. వివిధ పథకాలు ప్రవేశపెట్టే క్రమంలో ప్రజలతో మమేకమవ్వాలంటూ మంత్రులకు పిలుపునిచ్చారు.

వేసవి సమీపించడంతో విద్యుత్ రంగంపై ప్రత్యేకంగా మాట్లాడారు ముఖ్యమంత్రి. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని ఆదేశించారు. అదే టైమ్ లో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. అవసరమైతే ఛార్జీలు తగ్గించేలా విధివిధానాలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు.

మరోవైపు డీఎస్సీపై కూడా కీలక ఆదేశాలు జారీచేశారు చంద్రబాబు. వేసవి శెలవులు ముగిసి తిరిగి బడులు ప్రారంభమయ్యే సమయానికి ఉపాధ్యాయ నియామకాలు పూర్తవ్వాలన్నారు. పిల్లలతో పాటు, కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో అడుగుపెట్టాలన్నారు. వీటితో పాటు అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా లాంటి కార్యక్రమాలపై విధివిధానాలు ప్రకటించారు ముఖ్యమంత్రి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.