జనసేన నేత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు కేబినెట్ లో తీర్మానం కూడా చేశారు. ఆ విషయాన్ని మీడియాకు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే అప్పట్నుంచి ఇప్పటివరకు నాగబాబుకు ఇంకా మంత్రి పదవి దక్కలేదు.
ఎట్టకేలకు నాగబాబుకు లైన్ క్లియర్ కాబోతోంది. ఎమ్మెల్యే నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ నుంచి 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ముందుగా నాగబాబును ఎమ్మెల్సీగా గెలిపించుకొని, ఆ తర్వాత కేబినెట్ లోకి తీసుకోవాలనేది చంద్రబాబు ఆలోచన. దీనికి పవన్ కూడా ఓకే చెప్పారు.
రాజకీయాల్లోకి ప్రవేశించిన కొత్తలో లోకేష్ విషయంలో కూడా చంద్రబాబు ఇలానే వ్యవహరించారు. ముందుగా తనయుడ్ని శాసనమండలికి పంపించారు. ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు నాగబాబు విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నారు.
రాజకీయాల్లో రాణించాలనేది నాగబాబు చిరకాల కోరిక. ఒకదశలో ఆయన రాజ్యసభలో అడుగుపెడతారని అంతా భావించారు. కానీ పవన్ మాత్రం నాగబాబును రాష్ట్ర క్యాబినెట్ లోకే తీసుకోవాలని నిర్ణయించారు. మొత్తానికి జనసేన నుంచి మరో మంత్రి రాబోతున్నారు. ఇన్నాళ్లకు నాగబాబుకు లైన్ క్లియర్ అయింది.