తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల సందడి

Published by
Srinivas

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. అయితే దీనికి ప్రజలతో సంబంధం లేదు. ఎందుకంటే, ఇది ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఏపీలో ఐదుగురు, తెలంగాణలో మరో ఐదుగురు త్వరలోనే తమ ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకుంటున్నారు. ఇప్పుడా స్థానంలో అభ్యర్థుల్ని ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

మార్చి 29 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి యనమల, జంగా కృష్ణమూర్తి, అశోక్ బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు తమ పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. తెలంగాణ నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి శుభాష్ రెడ్డి, మీర్జా హాసన్, మల్లేశం తన పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు.

వీళ్ల స్థానంలో ఎవ్వర్ని ఎన్నుకోవాలనేది ఆయా రాష్ట్రాల్లో పార్టీలు నిర్ణయిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు నిర్ణయాత్మక శక్తిగా మారారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది కాబట్టి.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకునేవాళ్లు ఎమ్మెల్సీలు అవుతారు. ఈ విషయంలో వైసీపీ తన పట్టు కోల్పోయింది.

మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. మార్చి 10 వరకు నామినేషన్ల ప్రక్రియ నడుస్తుంది. 11వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. ఒకవేళ నామినేషన్లు ఉపసంహరించుకోవాలనుకుంటే 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. మార్చి 20వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తారు. 

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.