ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే డిజిటల్ సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కోసం మన మిత్ర వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభమైన ఈ వాట్సాప్ గవర్నెన్స్, ఇప్పుడు మరో అద్భుతమైన మైలురాయికి చేరుకుంది. మన మిత్రలో ఇప్పుడు 200 సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ గవర్నెన్స్ శక్తికి ఇదొక నిదర్శనమని అన్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్. పౌర సేవలు మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని, వాట్సాప్ గవర్నెన్స్ ను సమర్థవంతగా అమలు చేస్తామని ఈ సందర్భంగా లోకేష్ భరోసా ఇచ్చారు.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు మరింత సౌలభ్యంగా దక్కుతాయి. మిడిల్-మేన్ వ్యవస్థ, అవినీతి లాంటివి ఉండవు. పూర్తిస్థాయి పారదర్శకతకు అవకాశం ఏర్పడింది. ఈ సేవల్ని తాము ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంటామని లోకేష్ ప్రకటించారు. మన మిత్ర కోసం 955 23 00009కు సందేశం పంపాలని సూచించారు.