2025 ఆగస్టు 15న, భారతదేశం తన 79వ స్వాతంత్య్ర దినోత్సవంను ఘనంగా జరుపుకుంటున్న వేళ, సద్గురు స్వేచ్ఛా స్ఫూర్తి, జాతీయ వికాసంపై సరికొత్త పిలుపునిచ్చారు. కోయంబత్తూరులోని 112 అడుగుల ఆదియోగి విగ్రహం వద్ద, అలాగే బెంగళూరులోని సద్గురు సన్నిధిలో, ఈశా వాలంటీర్లు జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశానికి నివాళులు అర్పించారు.
సద్గురు తన X పోస్ట్లో పేర్కొంటూ, “భారతదేశం ఉత్సాహం, ఆశావాదం, ఆత్మవిశ్వాసంతో నిండిన ఈ దశలో, కేవలం సరళీకరణకే పరిమితం కాకుండా, నిజమైన స్వేచ్ఛ వైపు అడుగులు వేయాలి. విద్య, పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక సదుపాయాలను ప్రభుత్వ నియంత్రణల నుండి విముక్తి చేస్తే, వ్యక్తిగత ప్రతిభ వికసిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ కలలను సాకారం చేసుకునే అవకాశం పొందుతారు. భారతీయులు తమ దేశ భవిష్యత్తును స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇవ్వాలి” అని పిలుపునిచ్చారు.
అలాగే, వలసవాద ప్రభావం మనలను కేవలం మనుగడ కోసం మాత్రమే బ్రతికేలా మార్చిందని, ఆ ప్రభావాన్ని పూర్తిగా వదిలివేయాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. రహదారులు, వంతెనలు, విశ్వవిద్యాలయాలు వంటి ప్రజా మౌలిక సదుపాయాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, ఈ కార్యక్రమాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండనవసరం లేదని సద్గురు సూచించారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై స్పందిస్తూ, “ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తున్న దేశాల ధోరణులను ఎదుర్కోవడానికి, భౌగోళికంగా సమానమైన దేశాలతో బంధాలను బలోపేతం చేయాల్సిన సమయం ఇది” అని ఆయన స్పష్టం చేశారు.