కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6,735 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన లతారెడ్డి విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఈ విజయం 30 ఏళ్ల తర్వాత పులివెందులలో చరిత్ర సృష్టించిందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినందున 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని గుర్తుచేశారు. పులివెందుల కౌంటింగ్లో ఓటర్లు “30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని” స్లిప్ పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అక్కడ గతంలో ఉన్న పరిస్థితులు ఏవో ప్రజలు గమనించాలన్నారు.
పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విజయంపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ప్రజలను చైతన్యం చేసేలా మాట్లాడాలని సూచించారు. పులివెందుల విజయం ఏపీ ప్రజలకు ప్రజాస్వామ్య పునరుద్ధరణ సంకేతం అని సీఎం పేర్కొన్నారు.