తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్డ్యామ్ రెండునెల్లకే కొట్టుకుపోయిందని, ఈ విషయం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
“SLBC టన్నెల్ తవ్వడం చేతకాదు.. సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివి లేదు. చివరికి ఓ చెక్డ్యామ్ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లడం సిగ్గుచేటు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
నాసిరకం పనుల వలన రైతుల పొలాలు, మోటార్ పైప్లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, బాధితులను ఆదుకునేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజల డబ్బుతో నిర్మించిన చెక్డ్యామ్ రెండు నెలలు కూడా నిలబడలేకపోవడం వారి పనితీరుకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. “ప్రాజెక్టుల మాట దేవుడెరుగు.. ఒక్క ఇటుక కూడా సరిగా పేర్చలేని ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే స్థితిలో లేరు” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.