జగన్ పై సంచలన ఆరోపణలు

Published by
Srinivas

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు ఆ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఈయన, ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరమయ్యారు. పార్టీకే కాదు, మొత్తం రాజకీయలకే తను దూరమౌతున్నట్టు ప్రకటించారు.

ఇప్పుడీ వ్యక్తి మరోసారి జగన్ తో తన బంధంపై స్పందించారు. కేవలం మనసు విరిగిపోవడం వల్ల జగన్ నుంచి, ఆయన పార్టీ నుంచి దూరమైనట్టు వెల్లడించారు. జగన్ చుట్టూ ఓ కోటరీ ఉందని, ఆయన దగ్గరకు వెళ్లాలన్నా, వేరే వ్యక్తిని తీసుకెళ్లి పరిచయం చేయాలన్నా, ఆ కోటరీ దాటి వెళ్లాలని అన్నారు.

ఆ కోటరీలో వ్యక్తుల చెప్పుడు మాటలు విని జగన్ పూర్తిగా మారిపోయారని ఆరోపించారు విజయసాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదని, కోటరీ నుంచి బయటకు రావాలని, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో, రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి చేయాలని కోరారు.

జగన్ లండన్ లో ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్పానని, అదే టైమ్ లో తను పార్టీ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని కూడా ఆయనకు వెల్లడించానని అన్నారు విజయసాయి. మూడు తరాలుగా వైఎస్ కుటుంబానికి విశ్వాసంగా ఉంటున్నానని, అలాంటి తన మనసు ముక్కలైందని, తనను కొనసాలని జగన్ కోరినప్పటికీ, విరిగిన మనసు అతుక్కోదని అన్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.