‘గబ్బర్ సింగ్’తో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన నటుడు రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్కు గురై హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తోటి కళాకారుల కష్టసుఖాల్లో ఎప్పుడూ అండగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు చికిత్సకు అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలిచారు.
అపోలో ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సుబ్బారెడ్డితో తరచూ మాట్లాడుతున్న చిరంజీవి.. రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా అవసరమైన సహాయం అందించాలని సూచించినట్లు సమాచారం.
అంతేకాకుండా రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరంజీవి, చికిత్స ఖర్చుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తన తరఫున రూ.3 లక్షల చెక్కును ఆయన సతీమణికి అందజేశారు.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా స్పందించి, తన తరఫున రూ.2 లక్షల చెక్కును అందించి కుటుంబానికి అండగా నిలిచారు.
సినీ పరిశ్రమలో అవసరంలో ఉన్న కళాకారులు, కార్మికులకు అండగా నిలవడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. గతంలో కూడా పలువురు నటీనటులు, సినీ కార్మికులకు ఆయన చేసిన సహాయాలు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇప్పుడు నటుడు రమేష్కు అందించిన ఈ సాయం కూడా ఆయన మానవత్వానికి మరో నిదర్శనంగా నిలిచింది.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న నటుడు రమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.