సినిమా వార్తలు

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

Published by
Rahul N

భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 83 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

రంగస్థలంనుంచి వెండితెరకు

1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావుకు బాల్యం నుంచే నాటకాలపై మక్కువ ఎక్కువ. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన ఆయన, ఉద్యోగంతో పాటు తన నాటక అభిలాషను కొనసాగించారు.

కుటుంబ జీవితం

1968లో రుక్మిణిని వివాహమాడిన కోట శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కోట ప్రసాద్ ఉన్నారు. అయితే 2010 జూన్‌లో ఒక రోడ్డు ప్రమాదంలో కుమారుడు ప్రసాద్ మృతి చెందడం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

సినీ ప్రస్థానం

1978లో ప్రాణం ఖరీదు అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కోట, 1985లో విడుదలైన ప్రతిఘటన చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసి చూడాల్సిన అవసరం రాలేదు. విలన్, కామెడీ, గంభీర పాత్రలు-ఏదైనా సరే, తన సహజ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన కోట, 750కి పైగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి అపారమైన గుర్తింపు పొందారు.

రెపటి పౌరులు, అహ నా పెళ్ళంట, శివ, శత్రువు, గాయం, మనీ, హలో బ్రదర్, ఆమె, లిటిల్ సోల్జర్స్, గణేష్, ఆ నలుగురు, అతడు, బొమ్మరిల్లు, సర్కార్, అత్తారింటికి దారేది, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు ఎన్నటికీ మర్చిపోలేనివిగా నిలిచాయి.

రాజకీయ జీవితంలో కూడా నిలిచిన కోట

కేవలం నటుడిగానే కాకుండా రాజకీయంగా కూడా కోట తనదైన సేవలు అందించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు.

పద్మశ్రీ పురస్కారం

చిత్రరంగానికి, ప్రజాసేవకు అందించిన విశేష సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం, 2015లో కోట శ్రీనివాసరావును పద్మశ్రీతో సత్కరించింది.

Rahul N