దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ‘డైరెక్టర్స్ డే 2026’ వేడుక హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, నటులు పెద్ద సంఖ్యలో పాల్గొని దాసరి గారి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు మోహన్ బాబు, నటుడు బాబూమోహన్, సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రద తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంచు మోహన్బాబు మాట్లాడుతూ తన గురువు, మార్గదర్శకుడు అయిన దాసరి నారాయణరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
“ఆయన పుట్టినరోజును ఇలా జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉన్నప్పటికీ, ఇది నాకు బాధాకరమైన రోజే. తండ్రి లాంటి వ్యక్తిని నేను కోల్పోయాననే బాధ నాకు జీవితమంతా ఉంటుంది. ఎక్కడో ఉన్న నన్ను ఇండస్ట్రీకి తీసుకువచ్చి ‘మోహన్బాబు’గా పేరు పెట్టి ఈ స్థాయికి తీసుకువచ్చారు,” అని చెప్పారు.
“ఈ తరం చాలామందికి దర్శకుడు అనే పదానికి అసలు అర్థం తెలియదు. ఆ పదానికి అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావు గారు” అని తెలిపారు.
ఈ వేడుకలో మంచు మోహన్బాబు డైరెక్టర్స్ అసోసియేషన్కు రూ.15 లక్షల విరాళాన్ని ప్రకటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ఆయనకు దాసరి గారి పట్ల ఉన్న గౌరవం, కృతజ్ఞతను మరోసారి చాటిచెప్పింది.
దాసరి నారాయణరావు వంటి మహానుభావుల జ్ఞాపకాలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయనలాంటి గురువును కోల్పోయిన బాధను మోహన్బాబు మాటల్లో స్పష్టంగా కనిపించగా, ఆయనకు చేసిన నివాళి సినీ పరిశ్రమలోని బంధాలను మరోసారి గుర్తు చేసింది.