2022లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా భర్త విద్యాసాగర్ (48) కన్నుమూసిన తరువాత నటి మీనా జీవితంలోనే అతిపెద్ద దెబ్బ తగిలింది. భర్తను కోల్పోయిన ఆ బాధతో తన టీనేజ్ కూతురికి తల్లి, తండ్రి తానే అయ్యింది. అయితే ఆ కష్టసమయంలో కూడా ఆమెను విడిచిపెట్టని బాధ — నిరాధార రూమర్స్.
భర్త మరణించిన కొన్ని నెలలకే, మీనా రెండో పెళ్లి చేసుకుంటున్నారన్న పుకార్లు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఓ విడాకులు తీసుకున్న తమిళ స్టార్ తో ఆమెకు పెళ్లి జరుగుతోందని వచ్చిన వార్తలు మీనాను బాగా కలిచివేశాయి.
ఇటీవల జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ కార్యక్రమంలో పాల్గొన్న మీనా, ఆ రూమర్స్ గురించి మాట్లాడుతూనే భావోద్వేగానికి లోనయ్యారు.
“నా భర్త మరణించి కొద్ది కాలమే అయ్యింది. ఇలాంటి సమయంలో నన్ను వేరే హీరోలతో కలిపి రాయడం ఎంత దారుణమో చెప్పలేను. ఈ రూమర్స్ సృష్టించే వాళ్లకి గుండె ఉందా? కుటుంబం ఉందా? అని అనిపించింది. విడాకులు తీసుకున్న ఏ స్టార్ ఉన్నా వెంటనే నన్ను అతనితో లింక్ చేయడం మా కుటుంబానికి చాలా బాధాకరమైన అనుభవం,” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
మీనా మనసులోని ఈ వేదన బయటపెట్టిన తర్వాత, ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “మీనా గారు చాలా బాధలు ఎదుర్కొన్నారు, ఇకపై ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలి” అని వ్యాఖ్యానిస్తూ ఆమెకు అండగా నిలుస్తున్నారు.