
తన అద్భుత నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్లు, పవర్ఫుల్ యాక్షన్తో కోట్లాది అభిమానులను అలరించిన మెగాస్టార్ Chiranjeevi తన సినీ ప్రయాణంలోని అమూల్యమైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు.
దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా తెలుగు చిత్రసీమలో వెలుగొందుతున్న చిరంజీవి నటించిన తొలి చిత్రం Punadhirallu. ఈ సినిమా కోసం జీవితంలో మొదటిసారి కెమెరా ముందుకు నిలిచిన రోజు గుర్తుచేసుకుంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్టును షేర్ చేశారు.

“ఈరోజే ‘పునాదిరాళ్లు’ సినిమా కోసం జీవితంలో తొలిసారి కెమెరా ముందు నిలిచిన రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో చెప్పలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్నమొన్నటి సంఘటనలా అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథలా ఆ అనుభూతి గుర్తుకొస్తోంది,” అని మెగాస్టార్ పేర్కొన్నారు.
అలాగే తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. “వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన ఆ అవకాశం నా నటన ప్రయాణానికి పునాదిరాళ్లుగా నిలిచింది,” అని అన్నారు.

ఆ తొలి అడుగు నుంచి ఈరోజు వరకూ తనను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రేమే తనకు అసలైన బలం అని మెగాస్టార్ మరోసారి వెల్లడించారు.
ఈ భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఆయన సినీ ప్రయాణాన్ని స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
