
ఇటీవల విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు పెంచిన టికెట్ రేట్ల ద్వారా వచ్చిన రూ.42 కోట్లను రికవరీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు జీఎస్టీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 8న హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఒక మెమో జారీ చేస్తూ, మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రత్యేక షోలకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించడమే కాకుండా, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్లలో రూ.100 పెంచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఇది గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ మెమో జారీ చేయడం ద్వారా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా రూ.42 కోట్లు ఆర్జించారని, ఆ మొత్తాన్ని తిరిగి రికవరీ చేయాలని న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై ప్రాథమికంగా విచారణ చేపట్టిన హైకోర్టు, రూ.42 కోట్ల వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు జీఎస్టీ అధికారులను ఆదేశించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.
