సినిమా వార్తలు

తెలుగు చిత్ర పరిశ్రమలో విరబూసిన ‘పద్మశ్రీ’లు…

Published by
Suresh Thota

తెలుగు చిత్రపరిశ్రమ లో రెండు “పద్మశ్రీ”లు విరబూసాయి. ఒకరు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కాగా మరొకరు మురళీ మోహన్…

దేశ ప్రధాని అంటే ఎన్నో పనులు, ఎన్నో ఒత్తిడులు ఉంటాయి. దేశీయంగాను, అంతర్జాతీయంగాను తమ ఒత్తిడులతో సతమత మవుతుంటారు. అటువంటి వ్యక్తి తన ఒత్తిడిని తగ్గించుకోవడానికి సినిమాలు చూస్తుంటా… అందులోనే నేను రిలాక్స్ అవుతుంటా అని మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు… అనడంలోనే మన నటకిరీటి గొప్పతనం, నటనా కౌశలం అర్ధం అవుతుంది… ఆయనే మన రాజేంద్ర ప్రసాద్… అటువంటి వ్యక్తి తెలుగు వాడు కావడం… ప్రతి తెలుగువాడికి గర్వ కారణం.

ఒక వ్యక్తి ని తన నటన తో నవ్వించడం అంటే మామూలు విషయం కాదు….. హాస్యం గతి తప్పితే అపహాస్యం అవుతుంది. నలుగురిలో నవ్వులు పాలు అవుతారు… అటువంటిది… తెలుగు వారిని నవ్వించడానికి పుట్టినట్టుగా పుట్టిన వ్యక్తి … డా. రాజేంద్ర ప్రసాద్. ఆయనకు పద్మశ్రీ రావడం తెలుగు వారి కి, తెలుగు చిత్ర పరిశ్రమకి ఆనందదాయకం.

“నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం” అనేది ప్రసిద్ధ తెలుగు నానుడి. హాయిగా నవ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని డాక్టర్స్ అంటారు. అలా ఎందరికో ఈ డాక్టర్ కాని డాక్టర్ మన రాజేంద్ర ప్రసాద్.

గత 45 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ కు ఆయన చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు మరువలేనివి. ఉదా: ఆహా నా పెళ్ళంట, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, లేడీస్ టైలర్ లాంటి… ​ నవ్వులు పూయించే చిత్రాలు కాకుండా, సామాజిక బాధ్యత గల సినిమాలు ఉదాహరణకు: ఎర్రమందారం, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి… చిత్రాల ద్వారా ఆయన సమాజానికి మంచి సందేశాలను అందించారు. ఆయన నటనకు ఇప్పటికే పలుమార్లు నంది అవార్డులు కూడా వచ్చాయి. ​ఒకప్పుడు “కామెడీ కింగ్”గా పిలవబడిన ఆయన, వయసు పెరిగే కొద్దీ తండ్రిగా, తాతగా విలక్షణమైన పాత్రలు చేస్తూ ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సుమారు 200లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన సీనియారిటీని గౌరవిస్తూ ప్రభుత్వం ఈ పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది.

ఇక మురళి మోహన్…

సీనియర్ నటుడు మురళి మోహన్ కు ఈ ఏడాది “పద్మశ్రీ” పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ​ఆయన ఈ అవార్డు కు అర్హుడే… 1973లో ‘జగమే మాయ’ సినిమాతో కెరీర్ ప్రారంభించి, ఇప్పటివరకు సుమారు 350 పై చిలుకు చిత్రాల్లో నటించారు. బహుముఖ ప్రజ్ఞా శాలి…

ఆయన కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, మరియు వ్యాపారవేత్తగా సమాజానికి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించింది. మూడు చిత్రాలకు ఆయన నటుడుగా నంది అవార్డులు అందుకున్నారు. జయబేరి ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై రమారమి 25 చిత్రాల వరకు నిర్మించారు. ఉదా: “వారాల అబ్బాయి”, “ఓ తండ్రి తీర్పు”, “పెళ్ళాం చెబితే వినాలి” లాంటి చిత్రాల ద్వారా బాగా ప్రేక్షకాదరణ పొందారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.