
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో, శనివారం (ఏప్రిల్ 26న) ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం చాంబర్లో హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ఈ క్యాంప్లో జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హీరో & యాక్టర్ ప్రియదర్శి, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రియదర్శి మరియు నాగ వంశీ రిబ్బన్ కట్ చేసి హెల్త్ క్యాంప్ను ప్రారంభించగా, అనంతరం అవినాష్ చుక్కపల్లి, విశ్వ మోహన్, TFJA అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి వై.జె. రాంబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది.

క్యాంప్లో భాగంగా ప్రియదర్శి కూడా తన కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆయన చూపు పూర్తిగా ఆరోగ్యంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ, “తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అసోసియేషన్ పెద్దలకు, ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాష్ చుక్కపల్లి గారికి, శంకర్ ఐ హాస్పిటల్ మోహన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయం. ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత,” అని తెలిపారు.

శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ ఐ స్క్రీనింగ్ క్యాంప్లో 100 మందికి పైగా జర్నలిస్టులు మరియు వారి కుటుంబ సభ్యులు ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
