
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’ గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై భారీ అంచనాల నడుమ తొలి రోజే హీరోయిన్ త్రిష కృష్ణన్ చెన్నైలోని రోహిణి థియేటర్లో సినిమా వీక్షించారు.
త్రిష తన తల్లి ఉమా కృష్ణన్తో కలిసి థియేటర్కు చేరుకున్నారు. ఆమెను గుర్తించిన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. సాధారణ దుస్తుల్లో వచ్చిన త్రిష అభిమానులకు అభివాదం చేస్తూ థియేటర్లోకి వెళ్లారు.
సినిమా ముగిసిన తర్వాత మీడియా ప్రతినిధులు త్రిష స్పందన కోసం ఎదురుచూశారు. అయితే ఆమె ఎలాంటి కామెంట్ చేయకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే ఆమె తల్లి ఉమా కృష్ణన్ మాత్రం మీడియాతో మాట్లాడారు. “సినిమా చాలా బాగా నచ్చింది. మేము బాగా ఎంజాయ్ చేశాం. ఇది విజయ్ చివరి సినిమా కావడం బాధగా ఉంది. ఇకపై ఆయన సినిమాల్లో కనిపించరనే విషయం బాధేస్తోంది. ఆయనను చాలా మిస్ అవుతాం” అని ఆమె భావోద్వేగంగా అన్నారు.
విజయ్, త్రిష కలిసి గిల్లి, తిరుపాచ్చి, ఆది, కురువి, లియో వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తమిళ సినీ పరిశ్రమలో హిట్ జోడీగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ‘జన నాయకుడు’ విజయ్ సినీ ప్రయాణానికి ముగింపు పలుకుతున్న చిత్రం కావడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. విజయ్ ఇకపై పూర్తిస్థాయిలో రాజకీయాలకే అంకితం కానున్నారు.
