“ఆరోగ్యమే మహా భాగ్యం” పెద్దల మాట ఎంత నిజమో… “ఇంటికి దీపం ఇల్లాలే” అన్నది కూడా అంతే సత్యం… అటువంటి “దీపలక్ష్మి” ల ఆరోగ్యం కొరకు, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
“సర్వైకల్ క్యాన్సర్”… భారతదేశంలో మహిళల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న తీవ్రమైన వ్యాధుల్లో ఇది ఒకటి. ఈ వ్యాధికి ప్రధాన కారణం (Human Papilloma Virus) HPVఅనే వైరస్. ఈ వైరస్ వల్ల గర్భాశయ గర్భద్వారం వద్ద క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వ్యాధిని నివారించడానికి రూపొందించిన HPV వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నంలో ఒక ముఖ్యమైన ఆయుధం గా రూపొందింది. భారత్లో కూడా కేంద్ర ప్రభుత్వం మరియు అన్ని రాష్ట్రాలు ఈ వ్యాక్సిన్ను పెద్ద ఎత్తున మహిళలకు అందించేందుకు చర్యలు తీసుకున్నాయి.
సర్వైకల్ క్యాన్సర్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఆరోగ్య గణాంకాల ప్రకారం, భారత్లో ప్రతి సంవత్సరం 80,000 కొత్త కేసులునమోదవుతున్నాయి.సుమారు 40,000 పైగా మహిళలు ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ కేసులు సుమారు ఐదవ వంతు భారత్లోనే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి భారత మహిళల ఆరోగ్యానికి ఒక పెద్ద సవాల్గా మారింది.
HPV వ్యాక్సిన్ అనేది ఈ వైరస్కు వ్యతిరేకంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ వైరస్ ప్రభావాన్ని ముందుగానే అడ్డుకోవచ్చు. వైద్య పరిశోధనల ప్రకారం ఈ వ్యాక్సిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 90 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. వ్యాక్సిన్ ప్రధానంగా సర్వైకల్ క్యాన్సర్ను నివారించడంలో సహాయపడుతుంది. ముందస్తుగా 9 నుండి 14 సంవత్సరాల వయస్సులో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇతర HPV సంబంధిత సమస్యలు రాకుండా, ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందించనున్నారు. భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ను గణనీయంగా తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.
వైద్య నిపుణుల అంచనాల ప్రకారం భవిష్యత్ లో దేశవ్యాప్తంగా HPV వ్యాక్సిన్ కార్యక్రమం పూర్తిగా అమలు అయితే, వచ్చే దశాబ్దాల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 70 నుండి 90% వరకు తగ్గే అవకాశం ఉంది. లక్షలాది మహిళల ప్రాణాలు రక్షించవచ్చు. ఇది భారతదేశంలో మహిళల ఆరోగ్య సంరక్షణ లో ఒక కీలక మార్పుకు దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 28, 2026న, రాజస్థాన్ లోని అజ్మీర్లో దేశవ్యాప్త HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రారంభించగా… తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ కింగ్ కోఠి హాస్పిటల్లో ప్రారంభించారు.