నటుడు మంచు మనోజ్ మరియు భూమా మౌనికా రెడ్డి మార్చి 3న తమ మూడో వివాహ వార్షికోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుకలు సాదాసీదాగా జరిగినప్పటికీ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ జంటకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది.
సినిమా మరియు కుటుంబ సంబంధాల వల్లే ఈ ఇద్దరూ ఒక్కటయ్యారని చాలా మంది భావిస్తారు. అయితే నిజానికి ఇద్దరిలో ఉన్న క్రమశిక్షణ, జీవిత లక్ష్యాలపై ఉన్న స్పష్టత వారిని ఒక దగ్గరకు తీసుకొచ్చింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, చివరకు జీవిత ప్రయాణంలో కలిసి నడిచే నిర్ణయానికి దారి తీసింది.
మూడేళ్ల వైవాహిక జీవితంలో మనోజ్–మౌనికల కుటుంబం మరింత అందంగా విస్తరించింది. కుమారుడు ధైరవ్తో పాటు 2024 ఏప్రిల్ 2న జన్మించిన దేవసేన శోభ ఎం.ఎం వారి జీవితాల్లో మరింత ఆనందాన్ని తీసుకువచ్చారు. పిల్లలతో కలిసి వారి కుటుంబ జీవితం సంతోషంగా కొనసాగుతోంది.
వివాహం తర్వాత మంచు మనోజ్ కెరీర్ కూడా మంచి ఊపును అందుకుంది. ‘భైరవం’, ‘మిరాయ్’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకుని తన మాస్ అప్పీల్, స్క్రీన్ ప్రజెన్స్ను మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఆయన ‘డేవిడ్ రెడ్డి’ సినిమా షూటింగ్తో బిజీగా ఉండగా, మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతున్నాయి.
సినిమాలతో పాటు గత సంవత్సరం నవంబర్లో మనోజ్ ‘మోహన రాగం మ్యూజిక్’ అనే మ్యూజిక్ లేబుల్ను ప్రారంభించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, ప్రపంచ వేదికపై తెలుగు సంగీతాన్ని పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించారు.
ఇక భూమా మౌనికా రెడ్డి కూడా వ్యాపార రంగంలో తన ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తున్నారు. ఆమె స్థాపించిన ‘నమస్తే వరల్డ్ – సెలబ్రేటింగ్ కిడ్స్’ స్వదేశీ బొమ్మల బ్రాండ్ దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటికే 300కు పైగా రిటైల్ స్టోర్లలో వేలాది యూనిట్లు విక్రయించబడగా, ఈ బ్రాండ్ను మరింత విస్తరించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. అభిమానులు ఈ జంట ఇలాగే కలిసి ఎన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.