వార్తలు

ఇది ‘సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడం’ కాదు… వ్యూహాత్మక వైఖరి

Published by
Suresh Thota

“రోగి కోరుకున్నదే వైద్యుడు తినమన్నట్లుగా” ఉంది అమెరికా , భారత్ కి ఆయిల్ కొనుగోలు విషయంలో ఇచ్చిన వెసులుబాటు.

రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా 30 రోజుల వెసులుబాటు ప్రకటించగానే, సోషల్ మీడియాలోనూ, కొన్ని రాజకీయ వర్గాల్లోనూ “భారత్ తన సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిందా?” అనే విమర్శలు మొదలయ్యాయి. అయితే, లోతైన అంతర్జాతీయ రాజకీయాలను (Geopolitics) పరిశీలిస్తే, ఈ విమర్శలు కేవలం అజ్ఞానంతో కూడుకున్నవని అర్థమవుతుంది. వాస్తవానికి ఇది భారత్ సాధించిన అద్భుతమైన దౌత్య విజయం.

అమెరికా మనకు వెసులుబాటు ఇచ్చింది అని అంటున్నారు. అమెరికా తన స్వప్రయోజనం కోసమే ఈ వెసులుబాటు ఇచ్చింది. ఒకవేళ భారత్ వంటి భారీ వినియోగదారుడు రష్యా ఆయిల్ కొనడం ఆపేస్తే, ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్ $150 దాటిపోతుంది. అప్పుడు అమెరికాలో కూడా పెట్రోల్ ధరలు పెరిగి అక్కడి ప్రభుత్వం కుప్పకూలుతుంది. ప్రపంచ దేశాలు అన్ని కలసి అమెరికా మీద పడతాయి. దీని మూలంగా అమెరికా యే దీనికి అంటే వినాశనానికి మూలకారణం అని పాకిస్తాన్ లాంటి, అమెరికా మోచేతి నీరు తాగే దేశం కూడా విమర్శిస్తోంది. అందుకు…. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి భారత్ రష్యా ఆయిల్ కొనడం అమెరికాకు కూడా అత్యవసరం.

“సార్వభౌమత్వం” అంటే ఏ దేశం ముందు మోకరిల్లకుండా, ఏ దేశపు మాటకు, బెదిరింపులకు లొంగకుండా తన దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడం. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి పశ్చిమ దేశాలు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, భారత్ రష్యా నుంచి చమురు కొనడం ఆపలేదు. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ “స్కాట్ బెసెంట్” ప్రకటించిన 30 రోజుల వెసులుబాటు, భారత్ మొండితనం ముందు అమెరికా ఒక అడుగు వెనక్కి వేసిందని చెప్పడానికి నిదర్శనం.

సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్న మరియు రాజకీయ విమర్శకులు గమనించాల్సింది ఏంటంటే.. భారత్ ఈ దౌత్యం నడపబట్టే ఈరోజు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణలో ఉన్నాయి. యూరప్ దేశాలు రష్యా గ్యాస్ కోసం ఆంక్షలను పక్కన పెడుతున్నప్పుడు, భారత్ తన ఇంధన భద్రత కోసం చర్చలు జరపడంలో తప్పేముంది…? ఇది లొంగుబాటు కాదు, భారత ప్రజల అవసరాలకు అనుగుణంగా , “నేషన్ ఫస్ట్” పాలసీ నే ముందుకు తీసుకువెళుతున్నారు.

అమెరికాతో చర్చలు జరుపుతూనే, రష్యాతో ఉన్న పాత స్నేహాన్ని భారత్ వదులుకోలేదు. ఇది రెండు అగ్రరాజ్యాలను బ్యాలెన్స్ చేయగల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సామర్థ్యం. USA గతంలో ట్రంప్ హయాంలో ఉన్న కఠినమైన టారిఫ్లను భారత్ చర్చల ద్వారా తొలగించుకోగలిగింది. ఇది మన బేరసారాల శక్తిని (Bargaining Power) చూపిస్తుంది.

నేడు భారత్ ఒక “యాక్సెప్టెడ్ గ్లోబల్ పవర్”. అమెరికా ఇచ్చే 30 రోజుల సమయం అనేది మనపై ఆంక్షలు కావు, అది మన వాణిజ్యానికి దొరికిన చట్టబద్ధమైన క్లియరెన్స్…. అంటే “రోగి కోరుకున్నదే వైద్యుడు తినమన్నట్లుగా”

“సార్వభౌమత్వం తాకట్టు” అనే మాటలు కేవలం రాజకీయ నినాదాలు మాత్రమే. నిజమైన సార్వభౌమత్వం అంటే ప్రపంచ దేశాల ఒత్తిడిని తట్టుకుంటూ, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతినకుండా కాపాడుకోవడం. ఈ విషయంలో భారత్ ప్రదర్శిస్తున్న చొరవను చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోతున్నాయి. అమెరికా వెసులుబాటు ఇచ్చిందంటే, అది భారత్ గెలుపు మాత్రమే అని చూడాలి.

Suresh Thota