రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఇకపై ఎవ్వరూ ఆపలేరన్నారు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్. అమరావతి నిర్మాణం అన్-స్టాపబుల్ గా సాగుతుందని ప్రకటించారు. అదే టైమ్ లో అభివృద్ధి వికేంద్రీకరణ కూడా అంతే వేగంగా సాగుతుందని స్పష్టం చేశారు.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ సభలో లోకేష్ తన ప్రసందంతో ఆకట్టుకున్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూనే, డిప్యూటీ సీఎం పవన్ ను తన అన్నగా చెప్పుకొచ్చారు లోకేష్.
పోలవరం, విశాఖ ఉక్కు, భోగాపురం విమానాశ్రయం, ప్రకాశం జిల్లాలో సీబీజీ ప్లాంటు, కర్నూలులో హైకోర్టు బెంచీ.. ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ వేగంతో ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు మంత్రి లోకేష్.
“రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది మోదీ. దాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు. 1,631 రోజులు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఇప్పుడు మళ్లీ ఆయన చేతుల మీదుగానే అమరావతి పనులు పునఃప్రారంభమవుతున్నాయి. ఇక అమరావతి అన్ స్టాపబుల్. ఆంధ్రప్రదేశ్ లో మోదీ.. చంద్రబాబుతో కూడిన డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల వంటివి. ఎన్ని ఇబ్బందులున్నా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.”
గతంలో కొంతమంది అమరావతిని చంపేయాలని చూశారని.. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడు రాజధానులంటూ ఐదేళ్లూ గడిపేశారని… ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నినాదాన్ని ఆపలేకపోయారని అన్నారు లోకేష్.