ఆంధ్ర ప్రదేశ్

అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుంది – పవన్ కల్యాణ్

Published by
Srinivas

‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులుపడ్డారు. లాఠీ దెబ్బలు తిన్నారు. చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేశారు. ఈ ఉద్యమంలో మహిళా రైతులు చేసిన పోరాటం మరిచిపోలేనిది. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని ఆనాడు చెప్పాం. ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో రాజధాని పనులు పునఃప్రారంభం చేసుకుంటున్నాం’

అమరావతి పునర్నిర్మాణ వేదికపై నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును, ప్రజల ఆకాంక్షలను దివిసీమ ఉప్పెన మాదిరి తుడిచి పెట్టాలని చూసిందన్నారు పవన్.

అయితే ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు విజయం సాధించారని.. అమరావతి ప్రపంచ స్థాయి సర్వ శ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందని, ఒక ఆర్కిటక్చరల్ జోన్… ఒక కాంక్రీట్ జంగిల్ గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

రాజధాని రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదని.. రాష్ట్రానికి ఒక భవిష్యత్‌ ఇచ్చారని కొనియాడారు. పెహల్గాం ఉగ్రదాడి లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాజధాని పున: నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సమయం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలిపారు పవన్. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన 29 వేల పైచిలుకు రైతులకు శిరస్సు వంచి నమస్కరించారు పవన్.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.