ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత, సింహాచలంలో పర్యటించారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో హోం మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు.
కప్ప స్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం మంత్రికి, వేద ఆశీర్వచనం అందించారు పండితులు. ఆ తర్వాత మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.
చందనోత్సవం నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి అనిత, అధికారులకు పలు సూచనలు చేశారు. చందనోత్సవంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
శ్రీవరహా లక్ష్మి నరసింహా స్వామి వారిని, భక్తులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి.. అంతరాలయ దర్శనాలు ఉదయం ఆరు గంటలతో ముగిస్తాయని వెల్లడించారు.
భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సులు సిద్ధం చేశామని, ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఐదుగురు మంత్రుల బృందం చందనోత్సవం ఏర్పాట్లుపై సమీక్షించడం విశేషం. ఈ సంవత్సరం చందనోత్సవానికి సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని ఓ అంచనా.