
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియా వేదికగా వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పరిశ్రమలు రాష్ట్రంలోకి వస్తున్న వేళ, ఈ అభివృద్ధిని చూడలేకనే అవాస్తవాలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని అనిత మండిపడ్డారు.
హోంమంత్రి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి దిశగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని, వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని గుర్తు చేశారు. కానీ ప్రజలకు మేలు జరుగుతుండటమే కొంతమందికి సహించలేని విషయమై, తప్పుడు ప్రచారాల ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అబద్దాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అమరావతి అంశాన్ని మరోసారి లేవనెత్తుతూ, “ఉదయం లేచింది మొదలుకొని అమరావతి మునిగిపోయింది” అనే తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం దారుణమని ఆమె అన్నారు. వాస్తవానికి అలాంటి పరిస్థితి లేనప్పటికీ, ప్రజల్లో భయం కలిగించే విధంగా వార్తలు పంచడం దారుణమని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి మహిళా రైతులు గతంలో పాదయాత్రలు చేసి రాజధాని కోసం ఎంతటి త్యాగం చేశారో అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. అలాంటి పవిత్రమైన ఉద్యమాన్ని చిన్నబుచ్చే విధంగా మళ్లీ తప్పుడు ప్రచారం చేయడం దురుద్దేశపూరితమని పేర్కొన్నారు.
ప్రస్తుతం “అమరావతి మునిగిపోతుంది, నీటిని పొన్నూరు వైపు మళ్లించారు” అంటూ అడ్డదిడ్డంగా ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె విమర్శించారు. అభివృద్ధిని ఆపేయాలనే దురుద్దేశంతో ఇలాంటి దుష్ప్రచారాలు కొనసాగుతున్నాయని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గదని హోంమంత్రి స్పష్టం చేశారు.
అనిత హెచ్చరిస్తూ, “తప్పుడు ప్రచారాలు చేసే వారిని విడిచిపెట్టం. వాస్తవాలను వక్రీకరించి రాష్ట్రాన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
