ఆంధ్ర ప్రదేశ్

అప్పుడే భయపడలేదు.. ఇప్పుడు మీ రప్పా, రప్పాకు భయపడతామా?: నారా లోకేష్

Published by
Rahul N

నెల్లూరు పట్టణ నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో యువనేత నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి బ్లేడ్ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహిస్తున్న వైసీపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

“మీ తండ్రి హయాంలో 164 మంది మా కార్యకర్తలను చంపారు. అప్పుడే భయపడలేదు. ఇప్పుడు మీ రప్పా, రప్పాకు భయపడతామా?” అంటూ వైసీపీ నాయకత్వంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారి కోసం తాను ఎప్పటికీ నిలబడతానని స్పష్టం చేశారు.

సమావేశం అనంతరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెల్లూరు బారాషహీద్ దర్గాను సందర్శించి, రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా ఈ సందర్శన నిలిచింది.

విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు రచించిన నైతిక విద్యపై పుస్తకాలు, వీడియోలను తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. తరగతి గది నుంచే మహిళలను గౌరవించే పాఠ్యాంశాలను బోధిస్తున్నామని, పాఠశాలల్లో వారికి సురక్షిత వాతావరణం కల్పిస్తున్నామని వివరించారు.

డొక్కా సీతమ్మ పేరు మీద సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. “సన్నబియ్యం పెట్టాలనే ఆలోచన ఎందుకొచ్చిందంటే… డొక్కా సీతమ్మ గారు ఏమైనా ఇచ్చేటప్పుడు మంచి తినిపించాలి అనేది చూపిన తత్వం. అదే నాకు స్పూర్తి” అని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ గుండెచప్పుడు కార్యకర్తే అని లోకేష్ స్పష్టం చేస్తూ, తనకు స్ఫూర్తి ఇచ్చిన నాయకులుగా అంజిరెడ్డి తాత, మంజులారెడ్డి, తోట చంద్రయ్య, చెన్నుపాటి గాంధీలను గుర్తు చేశారు.

Rahul N