ఆంధ్ర ప్రదేశ్

ఒక్క రోజులో రూ.1500 కోట్ల పెట్టుబడి ఒప్పందం – నారా లోకేష్ బెంగుళూరు పర్యటన విజయవంతం

Published by
Srinivas

బెంగళూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన అంచనాలకు మించి విజయవంతంగా ముగిసింది. ఉదయం ప్రారంభమైన చర్చలు సాయంత్రానికి పెట్టుబడి ఒప్పందాలుగా మారాయి. ఒక్కరోజులోనే రూ.1500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, వీటి ద్వారా దాదాపు 35,000 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.

సత్వా గ్రూప్‌తో భారీ ఒప్పందం

ఉదయం సత్వా గ్రూప్ ప్రతినిధులతో చర్చలు జరిపిన మంత్రి లోకేష్, కొన్ని గంటల్లోనే వారిని ప్రాజెక్ట్ పెట్టుబడి కోసం ఒప్పించారు. ప్రముఖ రియాల్టీ సంస్థ సత్వా గ్రూప్ విశాఖపట్నంలో 30 ఎకరాల్లో వాంటేజ్ మిక్స్డ్ డెవలప్‌మెంట్ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌పై రూ.1500 కోట్ల పెట్టుబడి ఉండబోతుందని సంస్థ ప్రకటించింది.

ఈ క్యాంపస్ ద్వారా 25,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇందులో గ్రేడ్-ఎ ఆఫీసులు, రెసిడెన్షియల్ యూనిట్లు, స్టార్ట్ అర్బన్ వసతులు ఉంటాయి. విశాఖ నగరాభివృద్ధిలో ఇది ఒక మైలురాయిగా నిలవనుంది.

జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్‌తో మరో ప్రాజెక్ట్

ఇక మరోవైపు, ఏఎన్ఎస్‌ఆర్ సంస్థ జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్యాంపస్ ద్వారా మరిన్ని 10,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది.

లోకేష్ అద్భుత చొరవ

ఒకేరోజులో రెండు భారీ ప్రాజెక్టులు విశాఖకు తీసుకురావడం ద్వారా మంత్రి నారా లోకేష్ అభివృద్ధి పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి చాటిచెప్పారు. పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, నగర అభివృద్ధి — ఇవన్నీ ఈ పర్యటనలో ఒకే రోజు మలుపు తిరిగాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.