ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి మంత్రులకు ఇచ్చిన ర్యాంకింగ్స్ పై మరోసారి స్పష్టత ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. కేవలం పోటీతత్వం పెంచేందుకు ర్యాంకులు ఇచ్చామని, ఈ విషయంలో ఎవ్వరూ ఎక్కువ కాదు, తక్కువ కాదని అభిప్రాయపడ్డారు.
“ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది.”
ర్యాంకింగ్స్ లో చంద్రబాబు కూడా 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి తన పనితీరును కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి.
“లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప…విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది.”
అసాధారణ మెజారిటీ గెలిపించిన ప్రజల కోసం తొలి రోజు, తొలి గంట నుంచే ప్రయత్నిస్తున్నామని తెలిపిన చంద్రబాబు.. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే.. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నామని ప్రకటించారు.