మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అబద్ధాల్లో ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చని విమర్శించారు ఏపీ గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి.. గడిచిన ఐదేళ్లలో జగన్ ఎవ్వర్నీ కలవలేదని, ఎవ్వరితో మాట్లాడలేదని, ఆ విషయాన్ని ఆయనే అంగీకరించారని, దాచుకోవడం దోచుకోవడం అంటే ఏంటో చూపించడానికే జగన్ 2.0 అవతారం ఎత్తబోతున్నారని ఆరోపించారు.
పరిపాలనా దక్షుడైన చంద్రబాబుపై విమర్శలు చేయడం జగన్ పిచ్చితనానికి పరాకాష్ట అన్నారు సంధ్యారాణి. జగన్ చెప్తున్న అప్పుల్లో 20 వేల కోట్లు ఏప్రిల్, మే నెలల్లో జగన్ ప్రభుత్వం చేసినవేనని అన్నారు. ఎన్నికల కోడ్ సమయంలో తెచ్చిన అప్పులతో రాష్ట్రానికి జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ లా చంద్రబాబు రుషికొండ ప్యాలెస్ లు కట్టుకోలేదని, సొంత ఇంటి చుట్టూ కోట్లు పెట్టి ఇనుప కంచెలు నిర్మించుకోలేదని అన్నారు మంత్రి. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టి 8 లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోచుకున్నారని ఆరోపించిన సంధ్యారాణి.. ఐదేళ్లలో విపత్తు నిధులు, పోలవరం, గ్రామపంచాయతీలు సహా కేంద్రం ఇచ్చిన నిధులన్నింటినీ గత ముఖ్యమంత్రి దారి మళ్లించారని ఆరోపించారు.