ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని.. ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అత్యధిక మెజార్టీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారని, ఆ విషయంలో వైసీపీ వెనకబడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండో స్థానంలో జనసేన పార్టీ ఉందని గుర్తుచేశారు.
“రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఎవరికి దక్కితే వాళ్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతే తప్ప, గతంలో మేం పరిపాలంచామంటే ప్రతిపక్ష హోదా ఇవ్వరు. జనసేన కంటే కనీసం ఒక సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేది. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టం అంటోంది వైసీపీ. వాళ్లకు ప్రతిపక్ష హోదా రాదు. ముందు దీనికి మెంటల్లీ ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఇదేదో చంద్రబాబు ఇచ్చేది కాదు. రూల్స్ ప్రకారం రాదు.”
ప్రతిపక్ష హోదా రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారనే వైసీపీ విమర్శల్ని పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు. ఇది ఎవరో ఒకరు ఆపేది కాదన్నారు. రాజ్యాంగంలో రూల్స్ అలా ఉన్నాయన్నారు. ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ఆ విషయాన్ని ఆ పార్టీ సభ్యులు గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ సభ్యుల్ని అవమానపరచాలని, తగ్గించి చూపాలనే ఆలోచనలు కూటమి సర్కారుకు లేవన్నారు పవన్ కల్యాణ్.