
రాజకీయాల్లో పదవులు రావడం, బాధ్యతలు పెరగడం సహజం. కానీ ఆ అధికార హోదాలో ఉంటూ కూడా సామాన్యుడి కష్టాన్ని గుర్తించి, స్పందించే గుణమే ఒక నాయకుడిని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం హనుమకొండలో చేసిన పర్యటన ఇలాంటి స్ఫూర్తిదాయక ఘట్టానికి వేదికైంది. ఒక అరుదైన వ్యాధికి గురైన అభిమాని కోరికను తీర్చడమే కాకుండా, ఒక నిస్సహాయ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన ఆయన తీరు రాజకీయ శ్రేణులకే కాదు, యావత్ సమాజానికి ఒక గొప్ప సందేశాన్నిచ్చింది.
మంచంపై ఉన్న అభిమానిని… గుండెలకు హత్తుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్.
హనుమకొండ లో హనుమాన్ నగర్కు చెందిన 17 ఏళ్ల యువకుడు పొనుగోటి నిరంజన్, ‘డి.ఎన్.డి’ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధ పడుతున్నాడు. శారీరక ఎదుగుదల లేక, కదలలేని స్థితిలో మంచానికే పరిమితమైన ఆ కుర్రాడికి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. తన చివరి కోరికగా తన హీరోను ఒక్కసారైనా చూడాలని ఆశపడ్డాడు. ఈ విషయం తెలంగాణ జనసేన నాయకుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు.

అక్కడ కనిపించిన దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించింది. మంచంపై ఉన్న నిరంజన్ను చూసి ఉప ముఖ్యమంత్రి చలించిపోయారు. ప్రోటోకాల్స్ పక్కన పెట్టి, ఆ యువకుడి పక్కనే మంచంపై కూర్చుని ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఓదార్చారు. తానూ ‘చోటా గబ్బర్ సింగ్’ అని, చిన్నప్పటి నుంచి మీరంటే అభిమానమని నిరంజన్ చెప్తుంటే, పవన్ కళ్యాణ్ సహా అందరికీ కళ్ళు చెమర్చాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రాన్ని ఆ బాబుకి కప్పి, అక్షతలు ఇచ్చి పవన్ కళ్యాణ్ దీవించారు.
పవన్ కళ్యాణ్ పర్యటన కేవలం ఒక పరామర్శతో ముగిసిపోలేదు. అక్కడే ఆయనలోని నిజమైన ప్రజా నాయకుడు కనిపించాడు. ఆయన వెంటనే తక్షణ ఆర్థిక సాయం అందించారు. నిరంజన్ వైద్య ఖర్చుల నిమిత్తం తన వంతుగా రూ. లక్ష రూపాయల అందించి, వారి కుటుంబ జీవనానికి, భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశ్యం తో…… గతంలో నిరంజన్ తల్లిదండ్రులు కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్లో పనిచేసేవారనే విషయం తెలుసుకుని, వారి కుటుంబానికి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయించాలని తెలంగాణ జనసేన నాయకులను అక్కడికక్కడే ఆదేశించారు.

నిరంజన్ ఒక కుక్కపిల్ల బొమ్మను చూపిస్తూ, పెంచుకోవాలని ఉందని అడగగా, కొని పంపిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇల్లు అద్దెది కావడం వల్ల ఓనర్స్ ఒప్పుకోరని తండ్రి చెప్పడంతో, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ ఇంటి యజమానులను పిలిచి మాట్లాడి ఒప్పించడం ఆయన సంస్కారానికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ మానవత్వ ప్రయాణం అక్కడితో ఆగలేదు. నిరంజన్ ఆరోగ్యం కాంక్షిస్తూ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ హృదయపూర్వక ఘట్టం సామాజిక మాధ్యమాల్లో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
పవన్ కళ్యాణ్ చూపిన ఈ సేవా స్ఫూర్తితో చలించిపోయిన ప్రముఖ సినీ నిర్మాత, బండ్ల గణేష్ కూడా తక్షణమే స్పందించారు. నిరంజన్ వైద్య ఖర్చుల కోసం తన వంతుగా రూ. 5 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తన అభిమాన నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ, ఒక అభిమాని ప్రాణం కోసం ఇంతలా స్పందించడం అభినందనీయం.

ముగింపు: రాజకీయ నాయకులు ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో తిరిగే రోజులివి. కానీ, ఒక అల్పాదాయ వర్గానికి చెందిన అరుదైన వ్యాధిగ్రస్తుడైన అభిమాని కోసం సమయాన్ని కేటాయించి, అతని ఇంటి కి వచ్చి, వాళ్ళ భవిష్యత్తుకు భరోసానివ్వడం ఒక్క పవన్ కళ్యాణ్ కే సాధ్యమైంది. లీడర్ అంటే కేవలం శాసనాలు చేసేవాడు కాదు, ప్రజల గుండె చప్పుడు వినేవాడని ఆయన నిరూపించారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని, ఆ కుటుంబానికి భగవంతుడు మరింత ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిద్దాం.
