
“ఐఎన్ఎస్ దునగిరి”, “ఐఎన్ఎస్ సంశోధక్”, “ఐఎన్ఎస్ అగ్రయ్”తో భారత నౌకాదళానికి నూతన శక్తి, నూతన బలం ఏర్పడుతుంది అన్నారు ప్రధాని మోడీ. ఇవి భారత నౌకాదళ కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మన జలాలను మరింత సురక్షితం చేస్తాయి” అని పేర్కొన్నారు. అలాగే ఈ మూడు నౌకలు, సముద్ర యుద్ధ సామర్థ్యాన్ని, సముద్ర నిఘా వ్యవస్థను, జలాంతర్గామి నిరోధక శక్తిని, గణనీయంగా పెంచుతాయని చెప్పారు.
భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన దిశగా వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో, 2026 జూన్ 21న కోల్కతాలో జరిగిన ఒక కీలక కార్యక్రమం నిర్వహించారు. దేశ సముద్ర భద్రతా చరిత్రలో ఇది ప్రత్యేకమైన రోజు. ప్రధాని నరేంద్ర మోదీ భారత నౌకాదళంలో మూడు స్వదేశీ నౌకలను “ఐఎన్ఎస్ దునగిరి” (INS Dunagiri), “ఐఎన్ఎస్ సంశోధక్” (INS Sanshodhak), “ఐఎన్ఎస్ అగ్రయ్” (INS Agray) లను అధికారికంగా కమిషన్ చేశారు. సాధారణంగా ఒక నౌక నిర్మాణం పూర్తయిన తర్వాత అది వెంటనే యుద్ధ సేవల్లోకి వెళ్లదు. ముందుగా సముద్ర పరీక్షలు (Sea Trials), సాంకేతిక పరీక్షలు, ఆయుధ వ్యవస్థల పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆ నౌకను అధికారికంగా భారత నౌకాదళం సేవలోకి చేర్చే కార్యక్రమాన్ని “కమిషనింగ్ (Commissioning)” అంటారు.
ఈ మూడు నౌకలు కేవలం కొత్త యుద్ధ సామగ్రి మాత్రమే కాదు, భారతదేశం సముద్ర రంగంలో సాంకేతిక, పారిశ్రామిక, వ్యూహాత్మకంగా సాధిస్తున్న పురోగతికి ప్రతీకలు. భారత నౌకాదళం అవసరాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ నౌకలు మూడు వేర్వేరు బాధ్యతలను నిర్వహిస్తాయి. అందులో ఒకటి యుద్ధ నౌక, మరొకటి సముద్ర పరిశోధన నౌక, ఇంకొకటి జలాంతర్గాములను గుర్తించి ఎదుర్కొనే ప్రత్యేక నౌక. ఈ మూడు కలిపి భారత నౌకాదళానికి సమగ్ర సామర్థ్యాన్ని చేకూరుస్తున్నాయి.
“ఐఎన్ఎస్ దునగిరి” సముద్ర యుద్ధాల్లో అత్యంత కీలకమైన యుద్ధ నౌక. ఈ నౌక ప్రాజెక్ట్-17ఏ శ్రేణికి చెందిన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్. “స్టెల్త్” అంటే శత్రు రాడార్లకు సులభంగా కనిపించకుండా ఉండే సాంకేతికత. ఈ నౌక బ్రహ్మోస్ క్షిపణులు, ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు, అత్యాధునిక రాడార్లు, సోనార్ వ్యవస్థలతో అమర్చబడిన యుద్ధ నౌక. సముద్రంలో శత్రు యుద్ధనౌకలు, విమానాలు, జలాంతర్గాములను ఒకేసారి ఎదుర్కొనే సామర్థ్యం దీనికి ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నౌకాదళం ఉనికి పెరుగుతున్న సమయంలో ఇలాంటి నౌకలు భారతదేశానికి వ్యూహాత్మక బలాన్ని అందిస్తాయి.
“ఐఎన్ఎస్ సంశోధక్” సముద్ర రహస్యాలను వెలికితీసే పరిశోధనాత్మకమైన నౌక. ఇది యుద్ధనౌకలకంటే భిన్నంగా ఉంటుంది, ప్రధానంగా సముద్ర సర్వేలు నిర్వహించే నౌక. సముద్ర అడుగు భాగాల ఆకృతి, లోతులు, నౌకాయాన మార్గాలు, సముద్ర వనరులపై అధ్యయనం చేయడం దీని పని.

యుద్ధ సమయంలో కూడా ఈ సమాచారం అత్యంత కీలకం. సముద్రంలో ఏ ప్రాంతంలో జలాంతర్గాములు దాగి ఉండే అవకాశం ఉందో, ఎక్కడ నౌకలు సురక్షితంగా ప్రయాణించగలవో ఇలాంటి సర్వేలు చేసి సమాచారం తెలియజేస్తాయి. అందువల్ల ఈ నౌక నేరుగా యుద్ధం చేయకపోయినా, యుద్ధ విజయానికి అవసరమైన సమాచారాన్ని అందించే “కళ్లూ చెవులూ” లాంటిది.
“ఐఎన్ఎస్ అగ్రయ్” జలాంతర్గాముల పాలిట వేటగాడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచ నౌకాదళాల్లో అత్యంత ప్రమాదకర ఆయుధాలలో జలాంతర్గాములు ఒకటి. అవి సముద్ర అడుగున దాగి ఉండి ఆకస్మిక దాడులు చేస్తుంటాయి. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం “ఐఎన్ఎస్ అగ్రయ్”ను రంగంలోకి తీసుకొచ్చింది. ఇది యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ లో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) శ్రేణికి చెందిన నౌక. ఆధునిక సోనార్ వ్యవస్థల ద్వారా జలాంతర్గాములను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవడం దీని ప్రధాన బాధ్యత. ముఖ్యంగా భారత తీర ప్రాంతాలు, నౌకాశ్రయాల భద్రతలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
భారత నౌకాదళంలో ఇప్పటికే పలు స్వదేశీ యుద్ధనౌకలు సేవలందిస్తున్నాయి. ప్రాజెక్ట్ 17 కింద “ఐఎన్ఎస్ శివాలిక్”, “ఐఎన్ఎస్ సత్యపురా”, “ఐఎన్ఎస్ సహ్యాద్రి” వంటి స్టెల్త్ ఫ్రిగేట్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ 17ఏ కింద “ఐఎన్ఎస్ నీలగిరి”, “ఐఎన్ఎస్ ఉదయగిరి”, “ఐఎన్ఎస్ హిమగిరి” వంటి నౌకలు ఇప్పటికే చేరాయి, కొన్ని చేరే దశలో ఉన్నాయి. అలాగే సర్వే నౌకల విభాగంలో కూడా కొత్త తరహా నౌకలను అభివృద్ధి చేస్తున్నారు. జలాంతర్గాముల వేట కోసం రూపొందించిన అర్ణాలా శ్రేణి నౌకలలో ఐఎన్ఎస్ అగ్రయ్ ఒకటి.
భారతదేశం ప్రస్తుతం పలు భారీ నౌకా నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టింది. ప్రాజెక్ట్ 17ఏ కింద మరిన్ని స్టెల్త్ ఫ్రిగేట్లు. ప్రాజెక్ట్ 15బి కింద విధ్వంసక యుద్ధనౌకలు. అర్ణాలా తరగతికి చెందిన మరిన్ని జలాంతర్గామి నిరోధక నౌకలు. ఇవే కాక కొత్త తరహా సర్వే నౌకలు కూడా నిర్మాణం లో ఉన్నాయి. స్వదేశీ అణు జలాంతర్గాముల అభివృద్ధి తో పాటు, భవిష్యత్లో రెండో స్వదేశీ విమాన వాహక నౌక (IAC-2) ప్రణాళిక కూడా రూపుదిద్దుకుంటుంది. ఇవి పూర్తయితే భారత నౌకాదళం ప్రపంచంలోని అగ్రశ్రేణి సముద్ర బలగాలలో ఒకటిగా మరింత బలపడుతుంది.
ఈ మూడు నౌకల వల్ల భారతదేశానికి కలిగే ప్రయోజనం ఏమిటి అంటే…. మొదటిగా, విదేశీ నౌకలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. రెండవది, భారతీయ పరిశ్రమలకు భారీ ఉపాధి, సాంకేతిక పరిజ్ఞానం లభిస్తుంది. మూడవది, హిందూ మహాసముద్రంలో భారత ప్రభావం మరింత పెరుగుతుంది. నాలుగవది, చైనా వంటి దేశాలతో పెరుగుతున్న ముప్పును, సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా, యుద్ధం కేవలం ఆయుధాలతో గెలవదు, ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధాలు, ఇవే స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా సమాచార సేకరణ, నిఘా, సముద్ర మార్గాల నియంత్రణ, జలాంతర్గాముల నిరోధం వంటి అనేక అంశాల సమ్మేళనం వలనే ఏ దేశమైన విజయం సాధిస్తుంది. ఆ కోవలోనే ఐఎన్ఎస్ దునగిరి, సంశోధక్, అగ్రయ్ ఈ మూడు రంగాలను బలోపేతం చేస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్యంలో సుమారు 90 శాతం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. ఇంధన సరఫరాలు, వ్యాపార మార్గాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు అన్నీ సముద్రాలతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ల కమిషనింగ్ను సాధారణ నౌకల ప్రవేశంగా చూడలేం.
ముగింపు: ఇది భారతదేశం “కొనుగోలు చేసే దేశం” నుంచి “నిర్మించే దేశం”గా, “రక్షణ దిగుమతిదారు” నుంచి “రక్షణ సాంకేతిక శక్తి”గా మారుతున్న ప్రయాణంలో మరో మైలురాయి. ఈ మూడు నౌకలు భారత నౌకాదళానికి కొత్త బలాన్ని అందించడమే కాదు, ప్రపంచానికి ఒక సందేశం కూడా ఇస్తున్నాయి. భారతదేశం తన సముద్ర సరిహద్దులను కాపాడగలదు, తన నౌకలను తానే నిర్మించగలదు, సముద్రాల్లో తన వ్యూహాత్మక ఆధిపత్యాన్ని కూడా నిలబెట్టుకోగలదు.
