మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మంగళగిరి పరిధిలోని యాదవపాలెం గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామచంద్రస్వామి మందిరాన్ని ఆయన సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మరియు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తదనంతరం మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని సుమారు 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రైతులకు సాగునీరు అందించడం ద్వారా వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.