
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయమై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన అన్నారు.
“రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం ఉండవని మరొకసారి రుజువైంది. ఆయన మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది” అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి క్రెడిట్ తమదేనని బీఆర్ఎస్ ప్రభుత్వం వాదిస్తోందని ఆయన స్పష్టం చేశారు. “నాడు కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టు పూర్తికాలేదు. హై లెవెల్ బ్రిడ్జ్, ఆర్అండ్ఆర్, భూసేకరణ పనులు అసంపూర్ణంగానే మిగిలాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ. 2052 కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేశాం. 2016లో మొదటిసారి పూర్తిస్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నింపాం” అని వివరించారు.
హైదరాబాద్కు ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీల నీళ్లు తెస్తామని సీఎం రేవంత్ చేసిన ప్రకటనను హరీష్ రావు ఎగతాళి చేశారు. “ప్రాజెక్టు కెపాసిటీనే 20 టీఎంసీలు అయినప్పుడు మరి ఎలా 20 టీఎంసీలు ఇస్తారు? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు? ఇది గోబెల్స్ ప్రచారం తప్ప మరేం కాదు” అని ప్రశ్నించారు.
అలాగే, “ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్కు నీళ్లు గాలిలో వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు కెనాల్స్, గ్రావిటీ కెనాల్స్, రిజర్వాయర్లు, సబ్స్టేషన్లు, పంప్ హౌస్— అన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించింది. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే మేము పూర్తి చేశాం” అని మాజీ మంత్రి హరీష్ రావు హైలైట్ చేశారు.
రేవంత్ రెడ్డి వాస్తవాలు పక్కనబెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.
