
కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న సింగరేణి బొగ్గు కుంభకోణంపై గవర్నర్ను కలిసి పూర్తి వివరాలతో నివేదిక అందించామని K. T. Rama Rao వెల్లడించారు. ఈ అంశంపై తప్పకుండా న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
అయితే, ఒకవేళ న్యాయం జరగకపోతే సింగరేణి కార్మికులను కదిలించి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని కేటీఆర్ హెచ్చరించారు. సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో TBGKS ఆధ్వర్యంలో, మాజీ మంత్రి Koppula Eshwar నేతృత్వంలో ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలపై కార్మికులను చైతన్యపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో పరిస్థితి ఇంత దారుణంగా మారిందని, “సీఎం అంటే కోల్ మాఫియా నాయకుడు” అనే భావన సింగరేణి కార్మికులు, ప్రజల్లోకి వెళ్లిందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఒక్క సమాధానం కూడా రాలేదని ఆరోపించారు.
ఈ అంశంపై స్పందించాల్సిన ముఖ్యమంత్రి Revanth Reddy మాత్రం ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతూ, విదేశాల్లో తిరుగుతూ “పాఠాలు నేర్చుకుంటున్నా” అంటూ పోజులు ఇస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సింగరేణి నిధుల్లోని రూ.10 కోట్లను ఫుట్బాల్ మ్యాచ్ల కోసం దుర్వినియోగం చేసి కార్మికులకు అన్యాయం చేశారని ఆరోపించారు.
అంతేకాదు, రేవంత్ రెడ్డి తన సోదరులతో కలిసి హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లోని సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన 9,200 ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేశారని, ఇప్పుడు ఆ దోపిడీ సరిపోక సింగరేణినే గుత్తకు రాసిచ్చే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
సింగరేణి నిధులు, ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ఈ మొత్తం వ్యవహారాన్ని CBI లేదా SITకి అప్పగించాలని గవర్నర్ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. సింగరేణి కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
