
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, ఈ పదవికి ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా చివరి వరకు రేసులో నిలిచినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది.
తాజా సమాచారం మేరకు, రామచందర్ రావుతోపాటు మరో ఎంపీ కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే, ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే, చాలా రోజుల తర్వాత రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.
రామచందర్ రావు – బీజేపీలో సుదీర్ఘ సేవలతో ఉన్న సీనియర్ నేత
రామచందర్ రావు బీజేపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. ఆయన పార్టీకి ఎన్నో కీలక పదవుల్లో సేవలందించారు:
- 1980–82: భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా
- 1999–2003: బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్
- 2003–2006: బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్
- 2007–2009: బీజేపీ అధికార ప్రతినిధి
- హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడుగా కూడా సేవలందించారు
- 2015లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు
పార్టీలో చురుకైన పాత్ర పోషించిన రామచందర్ రావు న్యాయవాదిగా మంచి గుర్తింపు పొందారు. రాజకీయ అనుభవంతో పాటు న్యాయ రంగంలోనూ ఆయనకు విశేషమైన స్ధానం ఉంది. రానున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయనను అధ్యక్ష పదవికి ఎంపిక చేయడం వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు.
రామచందర్ రావు నామినేషన్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు దాఖలవుతుందని సమాచారం. అధికారిక ప్రకటనతో పాటు నామినేషన్ ప్రక్రియ అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
