
తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత మరోసారి ముదిరింది. బంజారాహిల్స్ పెద్దమ్మగుడి లో నిర్వహించనున్న కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని, అనంతరం త్రివర్ణ పతాకాలతో భారీ తిరంగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నాగం రాంచందర్ రావును పోలీసులు ఈ రోజు ఉదయం గృహనిర్బంధం చేశారు.
బీజేపీ నేతల ప్రకారం, రాంచందర్ రావును అకారణంగా, అక్రమంగా గృహంలోనే నిర్బంధించడం, ఆయన ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ, నియంతృత్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా జరగాల్సిన మతపరమైన కార్యక్రమం మరియు దేశభక్తి ప్రదర్శన అయిన తిరంగా ర్యాలీని అడ్డుకోవడం పూర్తిగా అంగీకారయోగ్యం కాదని బీజేపీ తీవ్రంగా ఖండించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, పౌర హక్కులను తుంగలో తొక్కుతూ, రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడమే లక్ష్యంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది అని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాంచందర్ రావు గృహనిర్బంధం ఘటనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఆయనకు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
