
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే వైసీపీ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతూ నినాదాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత కొద్ది సేపటికే సభ నుంచి బయటకెళ్లిపోయారు.
అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేశారు జగన్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన జగన్.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను మరింతమందికి తెలిసేలా చేయాలన్నారు.
ప్రస్తుతం అందరం యుద్ధ రంగంలో ఉన్నామని, ప్రజల తరఫున, ప్రజా సమస్యలపై పోరాటం చేసి, విజయం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు జగన్. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలని, కళ్లు మూసి తెరిచేలోగా ఏడాది గడిచిపోతుందని, జమిలీ ఎన్నికలు వస్తాయని అన్నారు.
