
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్బండ్లో ఉన్న ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham)కు ఆయన రూ.30 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు.
తన తండ్రి, ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం సంఘ భవనంలో ఒక గది నిర్మాణం కోసం ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం నాయకులకు రూ.30 లక్షల చెక్కును అందజేశారు.
ఈ విరాళం ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాల అభ్యున్నతి, విద్యా ప్రోత్సాహం, సామాజిక సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూరనుంది. సంఘ భవనం ద్వారా విద్యార్థులు, నిరుపేదలు మరియు సమాజంలోని వివిధ వర్గాలకు అందించే సేవల్లో అల్లు అరవింద్ సహకారం చిరస్థాయిగా నిలిచిపోనుంది.
ఈ సందర్భంగా సంఘ నాయకులు ఏవీ రత్నం, కోటేల శ్రీహరి, అరవ రామకృష్ణ, బైరా దిలీప్, చల్వాది రవి, విద్యాసాగర్, సుంకర వెంకటేశ్వరరావు, శివాజీ తదితరులు అల్లు అరవింద్కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం ఆయన అందించిన ఈ సహకారం ఆదర్శప్రాయమని కొనియాడారు.
సామాజిక బాధ్యతను గుర్తించి ముందుకు వచ్చిన అల్లు అరవింద్ సేవా కార్యక్రమాలకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.
