
హైదరాబాద్ సినీ ప్రేక్షకులకు మరో శుభవార్త. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, నగరంలో నిర్మాణంలో ఉన్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో అత్యాధునిక IMAX స్క్రీన్ను అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని ప్రేక్షకులకు అందించడంలో ఎప్పుడూ ముందంజలో ఉండే ఏఎంబీ సినిమాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఏషియన్ గ్రూప్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ల భాగస్వామ్యంతో ఏర్పడిన సంస్థ. దక్షిణ భారతదేశంలో తొలి డాల్బీ సినిమా థియేటర్ను ప్రారంభించడం నుంచి, హైదరాబాద్లో తొలి HDR by Barco స్క్రీన్లలో ఒకదాన్ని అందించడం వరకు థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంలో ఎన్నో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.

ఇప్పుడు అదే లెగసీని మరింత ముందుకు తీసుకెళ్తూ, ఏషియన్ గ్రూప్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటిలతో కలిసి తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక IMAX స్క్రీన్ను ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్తో హైదరాబాద్ ప్రేక్షకులకు మరింత అద్భుతమైన విజువల్ మరియు ఆడియో అనుభూతి అందుబాటులోకి రానుంది.
ఈ కొత్త మల్టీప్లెక్స్, తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ స్థలంలో నిర్మితమవుతోంది. దశాబ్దాలుగా ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలకు, అభిమానుల సంబరాలకు వేదికగా నిలిచిన ఈ చారిత్రాత్మక ప్రదేశం ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది.
సినిమా వారసత్వాన్ని, అత్యాధునిక ప్రదర్శన సాంకేతికతను ఒకే వేదికపై కలిపే ఏఎంబీ క్లాసిక్ విక్టరీ, హైదరాబాద్లో ప్రీమియం మూవీ-గోయింగ్ అనుభూతికి కొత్త నిర్వచనం ఇవ్వనుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ మల్టీప్లెక్స్, నగర సినీ అభిమానులకు కొత్త ఆకర్షణగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
