
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖామేనీపై అమెరికా రూ.92 కోట్ల భారీ రివార్డ్ ప్రకటించింది. మార్చి 14, 2026 తేదీన అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్కు చెందిన, డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీస్ (DSS) సంచలనాత్మక ప్రకటన చేసింది.
ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్కు కొత్త సుప్రీం లీడర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన, మోజ్తాబా హోస్సైనీ ఖామేనీ మరియు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఉన్నతాధికారులపై వారి ఆచూకీ, లొకేషన్, కార్యకలాపాల గురించి సమాచారం అందించిన వారికి 10 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారతీయ కరెన్సీ సుమారు రూ.92.47 కోట్లు) రివార్డ్ను ప్రకటించారు. ఈ ప్రకటన అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ లో ఏర్పడిన రాజకీయ, సైనిక వ్యవస్థ లోని లుకలుకలు నేపథ్యంలో వచ్చింది.
యుద్ధ నేపథ్యం ఈ రివార్డ్ ప్రకటనకు మూలం 2026 ఫిబ్రవరి 28 తేదీన జరిగిన అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల వల్ల , IRGC బేసులపై జరిగిన ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైకుల్లో అయతోల్లా అలీ ఖామేనీ (86 ఏళ్లు) మరణించారు. ఈ దాడుల్లో IRGC కీలక నేతలు కూడా చనిపోయారు. ఇరాన్ అధికారిక మీడియా మార్చి 4 వ తేదీన అలీ ఖామేనీ అంత్యక్రియలు వాయిదా వేసినట్లు ప్రకటించింది, యుద్ధ పరిస్థితుల నేపద్యంలో…. ఈ సంఘటన తో ఇరాన్లోని అంతర్గత కుమ్ములాటలు బాహ్య ప్రపంచానికి తెలిసివచ్చాయి. ఇది కొన్ని అంతర్గత శక్తుల మధ్య పోరాటానికి దారితీసింది.
సుప్రీం లీడర్ అలీ ఖామేనీ మరణం తర్వాత ఇరాన్లో అత్యవసర సమావేశం జరిగింది. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ (88 మంది క్లెరికల్ సభ్యులు) వర్చువల్ మీటింగ్లో సెయ్యిద్ మోజ్తాబా ఖామేనీని (57 ఏళ్లు) కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. ఈ నియామకం మార్చి 8 నుంచి 12 వ తేదీ ల మధ్య జరిగినట్లు సమాచారం. IRGC ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించిందని, 17 ఏళ్ల క్రితం నుండే మోజ్తాబాను సిద్ధం చేసేలా కార్యాచరణ రూపుదిద్దుకుంది అని, దాని ప్రకారం గా, వ్యూహాత్మక ప్రణాళిక తో ఇది జరిగిందని నిపుణులు చెబుతున్నారు. “మోజ్తాబా”… ఆయూతుల్లా అలీ ఖామేనీకి రెండవ కుమారుడు. ఇతను తండ్రి ని మించిన సంప్రదాయ వాదిగా చెబుతారు. ఈయన తన ఆలోచనలకి అనుగుణంగా IRGCను తయారు చేశారు అని ఇరాన్ లోని కొన్ని రహస్య వర్గాల భోగట్టా.
‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ అనే US స్టేట్ డిపార్ట్మెంట్ కార్యక్రమం కింద ఈ రివార్డ్ ప్రకటించారు… మోజ్తాబాతో పాటు IRGC చైర్మన్, సీనియర్ కమాండర్లు, ఇతర అధికారుల మీద ఈ రివార్డ్లు ప్రకటించారు.
“మోజ్తాబా” మరియు IRGC ఇరాన్ నుండి సైనిక దాడుల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. USA మరియు ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ ప్రతీకార చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వారి ఆచూకీ తెలుసుకోవడం, వారిని సంస్థాగతంగా బలహీనపరచడం ముఖ్య ఉద్దేశ్యం. ఈ రివార్డ్ ద్వారా ఇరాన్ అంతర్గతంగా సమాచారం ఇచ్చే వారిని ప్రోత్సహించాలని ఉద్దేశం.
ఈ రివార్డ్ చెల్లింపు ప్రక్రియ చాలా గోప్యంగా ఉంచుతారు. ఈ విధానాల ద్వారా ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ కార్యక్రమం 1984 నుండి $250 మిలియన్లకు పైగా రివార్డులు చెల్లించింది అని సమాచారం. FBI, CIA లేదా DSS ద్వారా సమాచారాన్ని ధృవీకరిస్తారు. ధృవీకరణ తర్వాత గోప్యంగా ట్రాన్స్ఫర్ (స్విస్ బ్యాంకులు), క్రిప్టోకరెన్సీ (బిట్కాయిన్), మూడవ పక్ష మధ్యవర్తుల ద్వారా చెల్లిస్తారు. ఆచూకీ ఇచ్చినవారి గుర్తింపు ఎప్పటికీ బహిర్గతం కాదు. ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ ఇచ్చిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారికి $25 మిలియన్లు చెల్లించారు (2011). ఈ రివార్డ్ ప్రకటన నేపద్యంలో మోజ్తాబా ఇంకా స్పందించలేదు.
ఈ రివార్డ్ మధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
