
ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సమస్యలను సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది.
మంగళవారం రాత్రి నిరంతర వర్షాల కారణంగా దెహ్రాదూన్ జిల్లాలో అనేక నదులు ఉప్పొంగాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ట్రక్కులు, బస్సులు, వ్యక్తిగత వాహనాలు కూడా నిలిచిపోయాయి. డెహ్రాడూన్ లోని నదిని దాటుతుండగా, ట్రాక్ట్రర్ బోల్తా పడటంతో 10 మంది ఆ వరద నీటిలో గల్లంతయ్యారు. వారిని గుర్తించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.
ఇక ప్రేమ్నగర్ సమీపంలోని థర్కూర్పూర్లో స్వర్ణా నది మధ్యలో చిక్కుకుపోయిన ఒక చిన్నారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు #FWR ఆపరేషన్ ద్వారా రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. అనంతరం బాలుడికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ సంఘటన స్థానికుల్లో ఉపశమనాన్ని కలిగించినా, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి.
గార్వాల్ ప్రాంతంలోని అనేక గ్రామాలు వరద నీటితో మునిగిపోయాయి. పలుచోట్ల ఇళ్లలో నీరు చేరడంతో ప్రజలు గృహాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా పలువురు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు సమాచారం.
400 ప్రత్యేక బృందాలు రంగంలోకి
తీవ్ర వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వర్షపాతం ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 400 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా మోహరించబడ్డాయి.
భారత వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం, రాబోయే 25 నుంచి 30 గంటల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. గంగ, యమునా నదుల నీటి మట్టం వేగంగా పెరుగుతున్నందున, నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే మరిన్ని బృందాలను సహాయక చర్యల కోసం పంపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.
