
మ్యాథ్స్ కావాలంటే ఎంపీసీ తీసుకోవాలి. బయాలజీ చదవాలంటే బైపీసీ తీసుకోవాలి. రెండూ చదవాలనుకుంటే కుదరని పరిస్థితి. ఇప్పుడీ పరిస్థితిలో మార్పు రాబోతోంది. ఇంటర్ లో ఎంబైపీసీ చదవొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నుంచి విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ తో పాటు ఎంబైపీసీ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. దీంతో వారు ఇటు మెడిసిన్, అటు ఇంజినీరింగ్ రెండూ రాయొచ్చు. నీట్, జేఈఈలకు కూడా అర్హులే.
వచ్చే ఎకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో స్టేట్ సిలబస్ కాకుండా, ఎన్సీఈఆర్టీ సిలబస్ ను ప్రవేశపెడుతున్నారు. దీని వల్ల నీట్ లాంటి పరీక్షల్లో మరింత సులభంగా రాణించొచ్చు.
మార్చిన సిలబస్ ప్రకారం కొత్త పాఠ్యపుస్తకాలను తయారుచేసి, అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో విద్యార్థులకు ఉచితంగా అందిస్తారు. విద్యార్థులు 6 సబ్జెక్టులతో ఎంబైపీసీ చదువుకునే అవకాశం కల్పిస్తారు. 2 లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో ఒకటి ఇంగ్లిష్ తప్పనిసరి. రెండోది తెలుగు లేదా సంస్కృతం తీసుకోవచ్చు.
ఇక ఇంటర్ పబ్లిక్ పరీక్షల్ని మార్చిలో కాకుండా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహించాలని నిర్ణయించారు. దీని వల్ల పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి విద్యార్థులకు మరింత సమయం దొరుకుతుందన్నారు మంత్రి నారా లోకేష్.
