
సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లను వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సంచలన నిర్ణయం వల్ల 160 మంది సెక్షన్లు ఆఫీసర్లు బదిలీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ మేరకు సీఎస్ నోటీసు కూడా ఇచ్చారు.
అయితే ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చిన తర్వాత కూడా చాలమంది బదిలీలు జరగలేదు. సెప్టెంబర్ 30నే సంబంధిత ఫైల్ పై సంతకం చేసినప్పటికీ, ఇంకా కొంతమంది సెక్షన్లు ఆఫీసర్లు తమ కుర్చీలు వీడలేదు. ఈ జాప్యానికి ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య అభిప్రాయబేధాలే కారణమని తెలుస్తోంది.
చెప్పిన విధంగా బదిలీలు జరక్కపోవడంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. బదిలీలకు సంబంధించి వస్తున్న మార్పులు, అభ్యర్థనల్ని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించొద్దని సీఎస్ కు మరోసారి ఆదేశాలు జారీచేశారు ముఖ్యమంత్రి.

ఇప్పటివరకు జాయిన్ అవ్వని సెక్షన్ ఆఫీసర్ల వివరాలు సేకరించాలని, ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి తనకు ఇస్తే వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిద్దామని, చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ఆదేశించారు ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి తాజా ఆదేశాలతో సెక్షన్ ఆఫీసర్ల బదిలీ దాదాపు ఖరారైంది. ఇప్పటివరకు స్టేటస్ కో లో ఉన్న ఉద్యోగులు కూడా తమకు కొత్తగా కేటాయించిన కుర్చీల్లోకి వెళ్లాల్సిందే. సచివాలయాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.
