
తన పాలనలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడానికి వీల్లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్ఎల్బీసీ సమావేశంలో భాగంగా బ్యాంకర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఫార్మర్స్ ఫ్రెండ్లీగా బ్యాంకులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
సూక్ష్మ సేద్య రుణాల్ని కేంద్రం సులభతరం చేసిందని, కాబట్టి ఈ తరహా రుణాల్ని రైతులకు ఎక్కువగా ఇచ్చేందుకు బ్యాంకర్లు ప్రయత్నించాలని అన్నారు. ఇకపై రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని, దాని కోసం ఏం చేయాలో ప్రభుత్వం అంతా చేస్తుందని అన్నారు.
ప్రజల ఆహారపు అలవాట్లు మారాయంటున్నారు చంద్రబాబు. అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ వచ్చిందని, దీంతో పాటు ప్రకృతి అనుకూల సేద్యానికి బ్యాంకర్లు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని, ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాలని బ్యాంకర్లకు సూచించారు చంద్రబాబు. పీఎం సూర్యఘర్ కింద ఇళ్లకు సోలార్ విద్యుత్ ఇచ్చే అంశాన్ని బ్యాంకర్లు కూడా ప్రచారం చేయాలన్నారు.
